
యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా సాగింది. ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. రాజగోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్కు కంకణధారణ చేసిన వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అదే సమయంలో ఆలయంలోని ఇతర గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రలు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధానాలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఉపాలయాల్లోని ప్రతిష్ఠామూర్తులకు మహాప్రాణన్యాసం చేశారు. తొలి ఆరాధన సంప్రోక్షణ తర్వాత గర్భాలయంలో స్వయంభువుల దర్శనం ప్రారంభం అయింది. లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేసీఆర్ దంపతులను శాలువాతో సత్కరించారు. వారిని ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇక, యాదాద్రి ఆలయ పునరుద్ధరణలో శిల్పకళకు ఎనలేని ప్రాధాన్యత ఉన్న సంతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యమైన వారిని ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్, మంత్రులు సన్మానించారు. ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న ఆలయ ఈవో ఎన్ గీత, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, స్థపతి సుందర్ రాజన్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించి, సన్మానించారు. ఆలయ నిర్మాణం కోసం పనిచేసిన మరికొందరిని మంత్రులు శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆలయ ఈవో గీత, వైటీడీఏ వైస్ చైర్మన్ శాలువాతో సత్కరించి, నారసింహ స్వామి ఫోటోను బహుకరించారు.
ఇక, వారం రోజులుగా బాలాలయంలో కొనసాగిన పంచకుండాత్మక మహాయాగంలో మహా పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠ మూర్తులతో చేపట్టిన శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు సోమవారం ఉదయం మొదలైంది.బాలాలయం నుంచి బంగారు కవచ మూర్తులు, ఉత్సవ మూర్తుల శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర సాగింది. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు జరిగాయి. శోభాయాత్రలో సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారి శోభాయాత్ర ప్రవేశించింది. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా స్వామివారి పల్లకిని మోశారు.
యాదాద్రిలో నేటి సాయంత్రం నుంచి భక్తులకు స్వయంభువు లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. ఇక, యాదాద్రిలో ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.