మెదక్ లో దారుణం.. పట్టపగలే మహిళ గొంతుకోసి హత్య..

By SumaBala BukkaFirst Published Dec 26, 2022, 10:25 AM IST
Highlights

మెదక్ లో దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ మహిళ ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారు. ఆమె మెడలోని బంగారంతో ఉడాయించారు. 

మెదక్ : తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలే కొంతమంది దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో ఉన్నమహిళ గొంతుకోసి, దారుణంగా హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శనివారం మెదక్ లో చోటు చేసుకుంది. మెదక్ పట్టణ సీఐ మధు ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా తెలియజేశారు.

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టి గ్రామానికి చెందిన తలకొక్కుల కొడుకుల వెంకటేశం, సుజాత దంపతులు మెదక్ కు వలస వచ్చారు. ఇక్కడి పెద్ద బజార్లో అద్దెకు వుంటున్నారు. కూరగాయలు అమ్ముతుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రోజూలాగే శనివారం ఉదయం కూడా కూరగాయల అమ్మేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం బేరాలు అయిపోయిన తర్వాత పది గంటల సమయంలో.. భార్య సుజాత  ఇంటికి వెళ్లి,  వంట చేసి.. తనకు, భర్తకు ఇద్దరికీ మధ్యాహ్నానికి భోజనం తీసుకువస్తానని  బయలుదేరింది.

బస్సులో పర్సు పోగొట్టుకుంది.. అదే ఆమె ప్రాణాలు కాపాడింది..

10 గంటలకు వెళ్ళిన సుజాత.. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా తిరిగి రాలేదు. అంతేకాదు వెంకటేశం ఎన్నిసార్లు ఫోన్ చేసినా  ఎత్తడం లేదు. దీంతో అనుమానం వచ్చిన వెంకటేశం ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఇంట్లో సుజాత రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే తేరుకుని భయాందోళనలతో స్థానికులను గట్టిగా కేకలు వేసి పిలిచాడు. వారి సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

మెదక్ పట్టణ సీఐ మధు, డిఎస్పి సైదులు, ఎస్సై మల్లారెడ్డి,  మెదక్ రూరల్ సీఐ విజయ్కుమార్,  పోలీసు సిబ్బందితో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తీసుకువచ్చారు. వీటి ఆదారంగా వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి వచ్చి హత్యాతీరును పరిశీలించారు.. హంతకులను తొందరగా పట్టుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. 

హత్య జరిగిన తీరు అందరినీ భయాందోళనలకు గురి చేసింది. హంతకుడు సుజాత మెడ కోశారు. ముఖం మీద కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. అత్యంత దారుణంగా చంపేశారు. సుజాత మెడలో ఉండే మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలను కనిపించలేదు. వాటినివారు ఎత్తుకెళ్లారని.. నగల కోసమే ఇంత దారుణానికి తెగించారని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

click me!