
హైదరాబాద్: దేశ రాజధానిలో న్యూడిల్లీలో నిర్భయ (nirbhaya) జరిగిన ఘోరమే ఇటీవల తెలంగాణలో ఓ వివాహితపై జరిగింది. కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడగా ఇలాగే తెలంగాణ నుండి ఏపీకి వెళుతున్న మహిళపై కూడా కదులుతున్న బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. అంతేకాదు కత్తితో బెదిరించి మహిళ నుండి నగదు కూడా లాక్కున్నాడు దుండగుడు.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి (west godavari) జిల్లాకు చెందిన వివాహిత(29) జీవనోపాధి కోసం హైదరాబాద్ (hyderabad) లో నివాసముంటోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విబేధాలు రావడంతో విడిగా వుంటోంది. మాదాపూర్ లో బేబీ కేర్ టేకర్ గా పనిచేస్తూ తన ఇద్దరు బిడ్డలను పోషించుకుంటోంది.
అయితే స్వస్థలంలో పని వుండటంతో వివాహిత ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో టికెట్ బుక్ చేసుకుంది. బస్సు సిబ్బంది ఆమెకు చివరి సీటుకేటాయించారు. ఇలా ఈనెల 23వ తేదీన రాత్రి కూకట్ పల్లిలో ఆమె బస్సు ఎక్కగా ఈ సమయంలో మరికొందరు ప్రయాణికులు కూడా వున్నారు. దీంతో తన సీట్లో కూర్చున్న మహిళ కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంది.
సూర్యాపేటకు చేరుకునే సరికి బస్సులోని మిగతా ప్రయాణికులంతా దిగిపోయారు. దీంతో అర్థరాత్రి 12.30గంటలకు బస్సులో మహిళ ఒంటరిగా మిగిలిపోయింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ రాజేష్ కు నీచపు ఆలోచన వచ్చింది. ఒంటరిగా వున్న వివాహితను బెదిరించి అత్యాచారానికి పాల్పడాలని అతడు భావించాడు.
బస్సు డ్రైవింగ్ ను మరో డ్రైవర్ కు అప్పగించిన రాజేష్ ఓ కత్తి తీసుకుని నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లాడు. కత్తితో బెదిరించి కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు ఆమెవద్ద గల 7వేల రూపాయలను కూడా లాక్కున్నాడు.
అయితే శనివారం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న మహిళ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ నుండి బస్సు వివరాలను సేకరించిన పోలీసులు ఆరోజు బస్సు డ్రైవింగ్ చేసింది రాజేష్ గా గుర్తించారు. వివాహితపై అఘాయిత్యానికి పాల్పడిన రాజేష్ తో పాటు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, బందువులు డిమాండ్ చేస్తున్నారు.