కరోనా వైరస్: అంబులెన్స్ నుంచి దించే లోపే మహిళ మృతి

By telugu teamFirst Published Apr 15, 2020, 7:51 AM IST
Highlights
హైదరాబాదులోని కింగ్ కోఠీ ఆస్పత్రి సమీపంలో అంబులెన్స్ నుంచి దించే లోపలే ఓ మహిళ తుదిశ్వాస విడిచింది. ఆమెను మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం నుంచి హైదరాబాదు తరలించారు.
హైదరాబాద్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి తీసుకుని వచ్చిన 62 ఏళ్ల మహిళ అంబులెన్స్ నుంచి దించే లోగానే తుది శ్వాస విడిచింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి ఆమెను హైదరాబాదులోని కింగ్ కోఠీ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఆమెను వార్డులోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఆమె మరణించింది. 

తన కళ్లెదుటే తల్లి మరణించడంతో కుమారుడు చేష్టలుడిగి కన్నీరుమున్నీరయ్యాడు. దాంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంబులెన్స్ ను శానిటైజ్ చేశారు. మృతదేహానికి డిశానిటైజ్ చేసి, ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి అప్పగించారు. 

తమ అమ్మకు కరోనా లేదని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని, ప్లేట్ లెట్స్ పడిపోయాయని పరీక్షల్లో తేలిందని, అయినా వినకుండా కరోనా అనుమానితురాలిగా భావించి హైదరాబాదుకు తరలించారని మృతురాలి కుమారుడు అన్నాడు.

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 642కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 110 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మంగళవారం కరోనా వైరస్ తో ఒక్కరు మరణించారు. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 18కి చేరుకుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 249 కేసులు నమోదయ్యాయి.
click me!