కరెంట్ షాక్ పెట్టి.. కళ్లలో సూదులు గుచ్చి,.. భర్త హత్య

By ramya neerukondaFirst Published Aug 22, 2018, 11:26 AM IST
Highlights

మత్తులో ఉన్న సురేశ్‌ను తాళ్లతో కట్టేసి కరెంట్‌ షాక్‌ పెట్టారు. ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకొని పారిపోతుండగా ఇసురురాయి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. 

కరెంట్ షాక్ పెట్టి.. కళ్లల్లో సూదులు గుచ్చి మరీ ఓ భార్య..తన కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పెద్దనాగారం శివారు వస్రాంతండాకు చెందిన గుగులోతు సరిత(35)కు మండలంలోని ముంగిమడుగు సమీపంలోని నరసింహాపురం బంజర శివారు లాలితండాకు చెందిన గుగులోతు సురేశ్‌(40)తో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త తాను కూలీ పనులకు వెళ్లి తెచ్చిన డబ్బులు లాక్కొని మద్యం తాగడంతోపాటు..నిత్యం వేధిస్తున్న నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలూ జరిగాయి. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో..అతన్ని హతమార్చాలన్న నిర్ణయానికొచ్చింది.

బంధువులైన మరిపెడ మండలం వీరారం శివారు బాల్యాతండాకు చెందిన జర్పుల సుమన్‌(30, కురవి మండలం మంగోరిగూడేనికి చెందిన బానోతు గణేశ్‌(31)లతో కలిసి హత్యకు పథకం రచించింది. ఈ నెల 8న సాయంత్రం మాట్లాడాలని చెప్పి..ముగ్గురూ సురేశ్‌ను వస్రాంతండాకు తీసుకెళ్లారు. రాత్రి ఫూటుగా మద్యం తాగించారు. 

మత్తులో ఉన్న సురేశ్‌ను తాళ్లతో కట్టేసి కరెంట్‌ షాక్‌ పెట్టారు. ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకొని పారిపోతుండగా ఇసురురాయి, బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తండా శివారులోని పాశంబోడు గుట్టపైకి తీసుకెళ్లి పెట్రోలు పోసి దహనం చేశారు. మృతుడు ఎక్కడ దెయ్యమై వేధిస్తాడోనని భయపడిన నిందితులు..క్షుద్రపూజకుల సలహా మేరకు దహనానికి ముందు మృతుడి కళ్లలో గుండుసూదులు, పిన్నీసులు గుచ్చారు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం దహనం చేసిన ప్రాంతం చుట్టూ నువ్వులు పోశారు.

గుట్టపై దహనమైన వ్యక్తి శరీర భాగాలున్నట్టు గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లాలితండాకు చెందిన సురేష్‌ అదృశ్యమైనట్టు తెలుసుకొని..భార్య సరితను విచారించారు. ‘తానే హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. దీంతో భార్య, ఆమెకు సహకరించిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

click me!