పనిచేయని లైట్లు.. ఓటు ఎవరికి పడిందోనంటున్న ఓటర్లు

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 8:43 AM IST
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లపై ఓటర్లు మండిపడుతున్నారు. ఉదయం 7 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లపై ఓటర్లు మండిపడుతున్నారు. ఉదయం 7 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను నిలిపివేశారు.

దీంతో ప్రజలు క్యూలైన్‌‌లోనే వేచి చూస్తున్నారు. హైదరాబాద్ జియాగూడ ఇందిరానగర్‌లోని 31, 32 పోలింగ్ కేంద్రాలు, హిమాయత్ ‌నగర్ సెయింట్ పాల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 27, గచ్చిబౌలి హైస్కూలు, మల్కాజ్‌గిరి బాలికల ఉన్నత పాఠశాల, ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు నిరాశ చెందుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది ఈవీఎంలు ఉన్నప్పటికీ గదిలో లైట్లు లేకపోవడంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు.

ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.

దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

click me!