విద్యుత్ కనెక్షన్ ఇవ్వవా.. జూనియర్ లైన్ మెన్‌పై సర్పంచ్ బూతుల వర్షం, దాడి

By Siva KodatiFirst Published Jul 2, 2022, 9:16 PM IST
Highlights

తన వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదనే అక్కసుతో జూనియర్ లైన్ మెన్ పై దాడికి పాల్పడ్డాడో సర్పంచ్. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట్ మండలం కేశవాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

సిద్ధిపేట జిల్లా (siddipet district) హుస్నాబాద్ నియోజకవర్గ (husnabad) పరిధిలోని అక్కన్నపేట్ మండలం కేశవాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన విద్యుత్ జూనియర్ లైన్‌మెన్ పై ఆ గ్రామ సర్పంచ్ దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. తాడేపు శ్రీధర్ అనే వ్యక్తి కేశవాపూర్ గ్రామంలో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మగాని రాజేశం తన వ్యవసాయ భూమికి సంబంధించిన బోరు బావికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటూ శ్రీధర్ ను కోరాడు. దీనికి అతను స్పందిస్తూ వ్యవసాయ భూమికి దగ్గరిలో వున్న ట్రాన్స్‌ఫార్మర్ కు ఇప్పటికే ఐదు కనెక్షన్లు వున్నాయని .. ఇప్పుడు మీ వ్యవసాయ భూమికి కనెక్షన్ ఇస్తే దానిపై ఓవర్ లోడ్ పడి పేలిపోతుందని బదులిచ్చాడు. 

అయితే దీనిని వదలిపెట్టని సర్పంచ్.. వెంటనే లైన్ మెన్ భిక్షపతికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో సర్పంచ్ వ్యవసాయ భూమికి కనెక్షన్ ఇవ్వాలని శ్రీధర్ ను భిక్షపతి ఆదేశించాడు. కానీ దీనికి ఖాతరు చేయని శ్రీధర్ దీనిపై విద్యుత్ శాఖ ఏఈ నారాయణకు ఫోన్ చేసి అడగ్గా.. ఎలాంటి కనెక్షన్ ఇవ్వొద్దని ఆయన ఆదేశించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ రాజేశం.. తన మాట పట్టించుకోవడం లేదనే అక్కసుతో శ్రీధర్ ను దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీధర్ అక్కన్నపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 
 

click me!