
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత సమస్యలు పరిష్కారం కాకుపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణమని కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో టీడీపితో పొత్తును ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయాలని ఆమె అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీగా నష్టపోతామని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి చంద్రబాబు కారణమని ఆమె భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని విజయశాంతి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.
చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రంగా నష్టపోతామని ఆమె అన్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్లో కొన్ని సీట్లు గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్న కొందరు కాంగ్రెస్ నేతలు టీడీపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నారని ఆమె అన్నట్లు తెలుస్తోంది.