ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపింది. రెండు నెలల ముందే అతని చేతికి పాలసీ అందినట్లు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అభిషేక్, విజయ్ నాయర్లను న్యాయస్థానం మరో ఐదు రోజులు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు రూ.30 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపింది. అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్లు కలిసి లంచాలు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది.
హోల్సేలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని.. విజయ్ నాయర్ తనను తాను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీని తమ వారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు తెలిపింది. పాలసీ తయారీకి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చేసిందని ఈడీ తెలిపింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
అంతకుముందు అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్కు పాల్పడ్డాడని ఇప్పటికే తన రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపిన సంగతి తెలిసిందే. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు పేర్కొంది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. డిజిటల్ డివైజస్తో పాటు రికార్డులు సీజ్ చేశామని ఈడీ స్పష్టం చేసింది. 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని.. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది. సెల్ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.