నేడు సిట్ విచారణకు రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులు

By narsimha lodeFirst Published Mar 23, 2023, 10:12 AM IST
Highlights

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  ఘటనపై  సిట్  విచారణకు  రేవంత్ రెడ్డి  నేడు  హాజరు కానున్న నేపథ్యంలో  కాంగ్రెస్ నేతలను  ముందస్తుగా  హౌస్  అరెస్ట్  చేశారు పోలీసులు. 

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్ కేసులో  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  గురువారంనాడు సిట్  విచారణకు  హాజరు కానున్నారు. తన దగ్గరున్న  ఆధారాలను  ఇవ్వాలని  రేవంత్ రెడ్డికి  సిట్  నోటీసులు  జారీ చేసింది.  సిట్  విచారణకు  రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో  సిట్  కార్యాలయం వద్ద భారీ బందోబస్తును  ఏర్పాటు  చేశారు.  మరో వైపు  కాంగ్రెస్ నేతలను  ముందస్తుగా  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, వి. హనుమంతరావు తదితరులను  పోలీసులు  హౌస్ అరెస్ట్  చేశారు.  

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ఘటనపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు  చేశారు. మంత్రి కేటీఆర్  పీఏ  తిరుపతికి  ఈ వ్యవహరంలో  పాత్ర ఉందని ఆరోపించారు.  మరో వైపు  ఈ పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని  ఆయన  డిమాండ్  చేశారు. ఈ వ్యవహరానికి  ఐటీ శాఖతో  సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మరో వైపు  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్   కేసులో అరెస్టైన  రాజశేఖర్ రెడ్డి,  కేటీఆర్ పీఏ తిరుపతి గ్రామాలు  పక్క పక్కనే ఉంటాయన్నారు.  ఈ  మండలంలో  పలువురు  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షల్లో  ర్యాంకులు  పొందారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.    రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో  రాజశేఖర్  స్వగ్రామంలో  రెండు  రోజుల క్రితం  సిట్ బృందం విచారణ  నిర్వహించింది. 

పేపర్ లీక్ అంశానికి సంబంధించి  నిన్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు  వినతి పత్రం  సమర్పించింది.  కేటీఆర్  ను  భర్తరఫ్  చేసేందుుకు అనుమతివ్వాలని  కాంగ్రెస్ నేతలు  కోరారు.గతంలో  టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన  ప్రశ్నలకు  సంబంధించిన  పేపర్లు కూడా లీకయ్యాయా  అనే  కోణంలో కూడ సిట్ అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.  ఈ కేసులో  అరెస్టైన  నిందితుల  బ్యాంకు ఖాతాలను కూడా సిట్ అధికారులు  పరిశీలిస్తున్నారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా

పేపర్ లీక్ అంశం  తెరమీదికి రావడంతో  ఇప్పటికే  జరిగిన  నాలుగు పరీక్షలను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు  చేసింది.  మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది.  పేపర్ లీక్ అంశానికి  సంబంధించి  సిట్  జారీ  చేసిన  నోటీసులతో  రేవంత్ రెడ్డి  ఇవాళ  విచారణుక  హాజరు కానున్నారు. 

click me!