బీజేపీ నాలుగు సీట్లు గెలవగానే ఆగడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని ఆయన గుర్తు చేశారు.
శుక్రవారం నాడు అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలుస్తుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంచి మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు కచ్చితంగా తమ పార్టీకే ప్రజలు పట్టం కడుతారరని ఆయన తెలిపారు. గత ఐదున్నర ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే అనేక చట్టాలు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉందన్నారు.
ఎఐసీసీకి అధ్యక్షుడు లేనట్టే... తెలంగాణ పీసీసీకి కూడ అధ్యక్షుడు లేడని ఆయన ఎద్దేవా చేశఆరు. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న చర్చలపై తమకు ఆసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.
కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం విషయంలో కేసు కోర్టులో ఉందని, ఈ విషయమై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దామన్నారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకొంటానని ఆయన ప్రకటించారు.
గవర్నర్ ను మార్చే విషయం తనకు సమాచారం లేదన్నారు. గవర్నర్ వ్యవస్థలో తలదూర్చి ఏదో చేయడం లాంటి ఏం ఉండదన్నారు. ఏ వ్యవస్థ అయినా దాని పరిధిలో అది పనిచేస్తే ఇబ్బందులు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు
మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలదే బాధ్యత: కేటీఆర్