
కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. Union Budget 2022 దశ దిశా నిర్దేశం లేని పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అని మండిపడ్డారు. తాజాగా కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు.
రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కే కేశవరావు మాట్లాడుతూ.. బడ్జెట్ పూర్తిగా నిరాశ కలిగించిందన్నారు. ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ నిధుల్లో కోత పెట్టారని విమమర్శించారు. దశ,దిశ లేకుండా బడ్జెట్ ఉందన్నారు. ఉపాధి హామీ పథకానికి 25 శాతం నిధులు తగ్గించారని తెలిపారు. క్రిప్టో కరెన్సీపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. 30 శాతం పన్ను విధిస్తున్నారంటే దానిని లీగల్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. గ్రామీణ అభివృద్దికి కూడా నిధుల్లో కూడా కోత పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. అత్యంత సమర్ధవంతమైన ఎల్ఐసీని ప్రైవేటీకరణ చేయడం విచారకరమని అన్నారు. కేంద్రం తెలంగాణపై వివక్ష మాత్రమే చూపడం లేదని.. పట్టి పీడుస్తుందని తెలిపారు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఈ బడ్జెట్లో ప్రతి వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. పేదల, కార్మికుల, ఉద్యోగుల, రైతుల అందరికీ బడ్జెట్ చేసిందేమి లేదన్నారు. బడ్జెట్లో గుజరాత్లోని గిఫ్ట్ సిటీకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. కేంద్రం ప్రతి నగరాన్ని సమానంగా చూడాలని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ కూడా కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటుందని మండిపడ్డారు. ఇటీవల ఉపసంహరించిన సాగు చట్టాలను కేంద్రం మళ్లీ వేరే రూపంలో తీసుకొచ్చే ప్రమాదం ఉందని తమకు అనుమానం కలుగుతుందని ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు.