
power cut in Telangana: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. విద్యుత్ కోతతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో కరెంటు కోతతో రైతుల ఆగ్రహాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు (కేసీఆర్) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా గత మూడు రోజుల నుంచి గ్రామాల్లో రైతులకు 3 నుంచి 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని రఘునందన్ అన్నారు. ‘‘దేశానికి తెలంగాణ దిక్సూచి అని ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు చెబుతున్నారు. కరెంటు కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కొనడానికి మీ దగ్గర నిధులున్నాయా? ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందా’’ అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
పంట చివరి దశకు చేరుకోవడంతో కరెంట్ కోతలతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని పేర్కొన్నారు. మరో 15 రోజుల పాటు 24 గంటల పాటు కరెంటు ఇస్తే 100 శాతం దిగుబడి వస్తుందని తెలిపారు. మాయమాటలతో రైతులను మోసం చేయొద్దంటూ హితవు పలికారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో ఎలా విద్యుత్ ఇస్తున్నారో ఇతర జిల్లాలకు కూడా ఇస్తున్నారో లేదో ప్రభుత్వం చూపగలదా? అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.రాష్ట్రమంతటికీ సమానంగా విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలోని డిస్కమ్లకు (విద్యుత్ పంపిణీ సంస్థ) ప్రభుత్వం రూ. 17,202 కోట్లు బకాయి పడిందని ఈఆర్సీ చైర్మన్ రంగారావు చెప్పింది నిజం కాదా? బకాయిలు ఎందుకున్నాయో సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పగలరా? ఆ మూడు నియోజకవర్గాలకు అందించిన విధంగా రాష్ట్రమంతటికీ విద్యుత్ అందించాలి’’ అని ఆయన అన్నారు.
కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. దీంతో రైతులు ఇబ్బందులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు విధించారు. అయితే, సమాచారం లోపంతోనే ఈ సమస్య ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రంలో గురువారం నాడు కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల వల్ల వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఎన్పీడీసీఎల్ సంస్థలో నిన్న కొంత సమాచార లోపం తో వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిందనీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించే నిర్ణయం తీసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా ఉంటుందని టీఎస్ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు. విద్యుత్ కోతలు, కరెంట్ కట్ లు ఉంటాయని రాష్ట్ర రైతన్నలు ఎవరు కూడా ఆందోళన చెందల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు ఏ విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగిందో ముందు కూడా అలానే ఉంటుందని టీఎస్ ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.