ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి, నియోజకవర్గాల్లో మలివిడత ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగా పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి, నియోజకవర్గాల్లో మలివిడత ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణభవన్లో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. అభ్యర్థులను ప్రకటించి 45 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన ప్రచారం తీరుపై ఆరా తీయనున్నారు. ఇంకా 45 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండటంతో ప్రచార సరళి, పార్టీ అభ్యర్థులుగా అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలు, నాలుగున్నరేండ్లుగా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజలకు వివరించడంపై అవగాహన కల్పిస్తారు. అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం, ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు.
రాబోయే రోజులన్నీ ప్రచారానికి కీలకరోజులు కావడంతో ప్రచారంలో వేగం పెంచేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తిచేశారు. మలి విడత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోలో మార్పులు చేర్పులు సూచనలపై కూడా కేసీఆర్ అభ్యర్థులతో చర్చించనున్నారు.