బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటిన గులాబీ శ్రేణుల సంబరాలు..

By Sumanth KanukulaFirst Published Oct 5, 2022, 5:09 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. అన్ని జిల్లాల్లో గులాబీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకాయి. బీఆర్ఎస్‌గా మార్చి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ కావడంతోపై  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. ద్వితీయ శ్రేణి నాయకులంతా వారి వారి ప్రాంతాల్లో సంబరాలను నిర్వహించారు. 

ప్రధాన చౌరస్తాలల్లో పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిలాల్లి, దేశ్ కీ నేత కేసీఆర్.. అంటూ నినాదాలు చేశారు.అలాగే పట్టణాల్లోని ప్రధాన కేంద్రాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నిచోట్ల అయితే వడ్ల కుప్పల వద్ద కేసీఆర్ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నారు. 

ఇక, తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

అలాగే సర్వసభ్య సమావేశంలో..  పార్టీ రాజ్యాంగానికి అవసరమైన సవరణలు కూడా చేశారు. పార్టీ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలతో కూడిన తీర్మానాన్ని.. పార్టీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల సంఘానికి సమర్పించనుంది. పార్టీ పేరును మార్చాలని.. జాతీయ పార్టీగా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించనుంది. 

click me!