బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి..

By Sumanth KanukulaFirst Published Aug 15, 2022, 12:42 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పులలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. 
 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా దేవరుప్పులలో ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్.. పాలకుర్తి నియోజవర్గంలో అభివృద్ది జరగలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. అయితే బండి సంజయ్ కామెంట్స్‌పై అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. ఇది కాస్తా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. 

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మద్య రాళ్ల దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ పరిణామాలపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. సీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు.

click me!