
హైదరాబాద్: తమ పార్టీ Telanganaలో అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాల్లో Congress పార్టీలో చేరిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని TPCC చీఫ్ Revanth Reddy ప్రకటించారు.
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి Hyderabad ఆర్టీసీ కళ్యాణ మండపంలో సోమవారం నాడు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రానున్న 12 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. సోనియమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
పెన్షన్, రైతు రుణమాఫీ, ఆరోగ్య శ్రీ పథకాలను కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దగా తాను పార్టీ కార్యకర్తలకు ఈ హామీని ఇస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.
మార్చి 25వ తేదీ లోపుగా సభ్యత్వ నమోదులో అత్యంత ప్రతిభ చూపిన వారికి పార్టీలో పదవులు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 100 మంది సభ్యత్వం పూర్తి చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. పోలింగ్ బూత్ స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో బీహార్ నుండి ప్రశాంత్ కిషోర్ ను కేసీఆర్ తెచ్చుకొన్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సభ్యత్వాలు చేయని వారిని, సభ్యత్వాలు చేసిన వారిని ఒకే గాటన కట్టకూడదని రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పార్టీ సభ్యత్వాన్ని చేయాలని పీసీసీ నిర్ణయం తీసుకొంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. పార్టీ సభ్యత్వం తీసుకొన్న వారికి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ను కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలని ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యకర్తలను కోరారు. పార్టీ సీనియర్లు సహా ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వ నమోదు చేయాలని కేూడా రేవంత్ రెడ్డి కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పట్టించుకోని నేతలకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని కూడా రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రానికి నిర్ధేశించిన 30 లక్షల సభ్యత్వాన్ని ఆ పార్టీ ఇప్పటికే పూర్తి చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ నెల 25వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదును ఛాలెంజ్ గా తీసుకొని చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సహం నింపే ప్రయత్నం చేశారు. మండల స్థాయిల్లో మెంబర్ షిప్ ఎక్కువగా చేసిన వారిని జిల్లా స్థాయిల్లోకి జిల్లా స్థాయిల్లో మెంబర్ షిప్ ఎక్కువగా చేసిన వారిని రాష్ట్ర స్థాయిలోకి ప్రమోట్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.