Today Top Story: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. అది శ్వేత పత్రం కాదు.. స్వేద పత్రం..  పెండింగ్ చలాన్లపై భారీ డిస్

By Rajesh KarampooriFirst Published Dec 23, 2023, 6:00 AM IST
Highlights

Today Top Story: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీలో ఏపీ రాజకీయాల్లో సంచలనం .. కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ‘శ్వేతపత్రానికి’ కౌంటర్‌గా గులాబీ పార్టీ ‘‘స్వేదపత్రం’, కేజ్రీవాల్ కు ఈడీ షాక్.. మూడోసారి నోటీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లు చెల్లించడంపై భారీ రాయితీని ప్రకటించింది. నేడు వైకుంఠ ఏకాదశి.. ఆలయాల్లో పోటెత్తిన భక్తసంద్రం.. వంటి పలు వార్తల సమాహారం.  

Today Top 10 Telugu Lastest News: 

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ  

Latest Videos

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. సుపరిపాలన కోసమే ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఏర్పాటు చేశాము. రాజకీయాలంటే సుపరిపాలన అని నిరూపిస్తాం. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది. వీళ్లు తిన్నారని వాళ్లు,.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శిస్తున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. 


కేజ్రీవాల్ కు మరోసారి షాక్

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Liquor policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)  సమన్లు ​​పంపారు. కేజ్రీవాల్‌కు ఇలా పంపించడం మూడవ సారి. లిక్కర్ పాలసీ కేసు లో  ED జనవరి 3న ఈడీ ఎదుట హజరుకావాలని ఆదేశించింది.

శ్వేత పత్రం కాదు స్వేదపత్రం .. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీల నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసిందంటూ బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘‘శ్వేతపత్రానికి’’ కౌంటర్‌గా గులాబీ పార్టీ ‘‘స్వేదపత్రానికి’’ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు. పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన .. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని కేటీఆర్ హెచ్చరించారు.

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్
 
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పెండింగ్ చలాన్ల చెల్లించడంపై భారీ రాయితీని ప్రకటించింది. టూ వీలర్లు, త్రీ వీలర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 80 శాతం డిస్కౌంట్‌ను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఫోర్ వీలర్లు, హెవీ వెహికల్స్‌కు సంబంధించిన చలాన్లపై 60 శాతం, 50 శాతం రాయితీని ఇచ్చారు.ఈ నెల 26వ తేదీ నుంచి ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల చలాన్లపైగా పెండింగ్‌లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 
 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట 

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్ పై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ గెలువడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో పలు వాస్తవాలను వివరించకుండా గోప్యంగా ఉంచారంటూ,కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాగా.. కేవలం 2 కేసుల గురించి మాత్రమే అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలని 2019లో సిద్ధిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి. శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. 

నేడు వైకుంఠ ఏకాదశి.. ఆలయాల్లో పోటెత్తిన భక్తసంద్రం..

వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి నేడు(వైకుంఠ ఏకాదశి నాడు) శ్రీ మహా విష్ణువును పూజిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు వైష్ణవ దేవాలయాల్లోకి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి.. ఆ మహా విష్ణుమూర్తిని దర్శిస్తే.. సర్వ పాపాలు పోయి.. సమస్త పుణ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే.. తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు భారీగా బారులు తీరారు. తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు.  

పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి కారణమయ్యాడన్న అభియోగాలపై అరెస్ట్ అయిన ఎట్టకేలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పు వెలువరించింది. కాగా.. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ఈ అల్లర్లని ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణ ఉంది. పల్లవి ప్రశాంత్ తన అభిమానులని రెచ్చగొట్టే విధంగా వ్యహరించడంతో ఈ దాడులు జరిగాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించింది.

click me!