
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకోని మిమ్మల్ని రాళ్లతో కొట్లాలా? లేక చిపుర్లతో కొట్టాలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రజ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ.. ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర ఆరోపణలు, ఘాటు విమర్శలతో తెలంగాణ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాదయాత్రన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సి పాలిటీ పరిధిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. "తెలంగాణ తెచ్చింది తామేననీ, జీవితాంతం తమకే ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఎవరు తెచ్చారు తెలంగాణ? కోట్ల మంది ఆకాంక్షిస్తే వచ్చింది తెలంగాణ. లక్షల మంది ఉద్యమిస్తే వచ్చింది తెలంగాణ" అని షర్మిల అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో లక్షలాది మంది పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. వందల మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పాటైందని పేర్కొన్నారు. "వేల మంది ఆస్తులను త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ. వందల మంది బలిదానాలు చేసుకుంటే స్వరాష్ట్రం సిద్దించింది. కేసీఆర్ కుటుంబం లో ఎంత మంది ఆత్మబలిదానాలు చేశారు? కేసీఆర్ కుటుంబం లో ఎంత మంది చనిపోయారు తెలంగాణ కోసం..?" అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం బాగుండాలి కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ.. జీవనం సాగించాలా? అని ప్రశ్నించారు. "సీఎం కేసీఆర్ గారు బాగుండాలి...రాజ్యాలు ఏలాలి. ప్రజలు అవస్థలు పడాలి. ఆత్మహత్యలు చేసుకోవాలి.. ఇదేనా సుపరిపాలన? ఏం జరుగుతుంది తెలంగాణలో...ఎవరు తెచ్చారు తెలంగాణ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం పెద్దగా చేసిందేమి లేదని ఆరోపించారు. "కేసీఆర్, ఆయన కుటుంబం ఉద్యమం లో ఎం చేసింది.? పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచి పోయినట్లు నాటకం ఆడారు..గడ్డాలు పెంచుకున్నారు...దీక్షలు చేసినట్లు నాటకం ఆడారు" అంటూ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వారి రాజకీయ జీవితం కోసం ప్రజలను వాడుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ వాడుకుంటూ.. ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను వాడుకొని వారి శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ గడీల పాలనకు తెరలేపారని ఆరోపించారు. "పెద్ద పెద్ద గడీలు కట్టుకొని రాజ్యాలు ఏలుతున్నారు..ఆత్మగౌరవం అవసరానికి వాడుతున్నారు.. కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుంది" అని ఆరోపించారు.
"ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలి?" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం పంట నష్ట పోయిన రైతుకు నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని ఆరోపించారు. తెలంగాణ లో మీది దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ విమర్శించారు. "మిమ్మల్ని రాళ్లతో కొట్టాలా...చీపురు తో కొట్టాలా..? ప్రజల కష్టాలను పట్టించుకొనేందుకు మీ మీద చెప్పులు వేయాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.