స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో తప్పిన ప్రమాదం

First Published Jun 9, 2018, 2:15 PM IST
Highlights

స్పీకర్ కాన్వాయిని ఢీకొట్టిన లారీ

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

భూపాలపల్లి జిల్లా గణపురంలో స్పీకర్ మధుసూదనాచారి శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. 

బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు స్పీకర్‌ను క్షేమంగా గమ్యానికి చేర్చారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగంగా నుజ్జనుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!