#tahsildar Vijaya Reddy సజీవదహనం: మరో రెండు రోజుల బంద్

By Siva KodatiFirst Published Nov 5, 2019, 8:32 PM IST
Highlights

తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విజయారెడ్డి హత్యకు నిరసనగా మరో రెండు రోజులు రెవెన్యూ కార్యాలయాల బంద్‌ పాటిస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కలక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ స్పష్టం చేసింది.

తహశీల్దార్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అలాగే తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.

Also read:tahsildar Vijaya Reddy: అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని సురేష్

రెవెన్యూ శాఖలోని సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని.. తహశీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో మరణించిన డ్రైవర్ గురునాథం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆర్ధిక సాయం సహాయం అందించాలని జేఏసీ తెలిపింది. గురునాథం కుటుంబానికి ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు జేఏసీ తెలిపింది. 

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు.

ఈ ఘటనలో గురునాథానికి 80 శాతం గాయాలయ్యాయి. దీంతో ఆయనను డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం నాడు ఉదయం మృతి చెందాడు.

Also Read:విజయారెడ్డి హత్య వెనుక టీఆర్ఎస్: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య ప్రయత్నించారు. డ్రైవర్ గురునాథం 80 శాతం కాలిపోయాడు. చంద్రయ్య 60 శాతం కాలిపోయాడు.

సూర్యాపేట జిల్లాకు చెందిన గురునాథం సుమారు ఆరు ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డిని తన సోదరిగా గురునాథం భావించాడు. దీంతో ఆమె గురునాథాన్నే తన డ్రైవర్ గా కొనసాగించింది. 

డ్రైవర్ గురునాథం విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. గురునాథం కుటుంబం చాలా పేద కుటుంబం. విజయారెడ్డి కుటుంబంలో సభ్యుడిగా గురునాథం ఉండేవాడని ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెబుతున్నారు.

click me!