దిశ ఎఫెక్ట్: సమత కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు

By Nagaraju penumalaFirst Published Dec 11, 2019, 4:57 PM IST
Highlights

కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ స‌మ‌త కేసులో ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమతపై రేప్ హత్య ఘటనలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకానుంది. సమత  కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 

రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనను పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ స‌మ‌త కేసులో ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు. 

దిశ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వేగంగా స్పందించిందని, స‌మ‌త కేసులో కూడా స‌త్వ‌ర న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేసిందని తెలిపారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం శాంతి భ‌ద్ర‌త‌లకు అధిక ప్రాధ‌ాన్య‌తనిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దోషుల‌కు వెంట‌నే శిక్ష‌లు ప‌డేలా, భాదితుల‌కు స‌త్వ‌ర న్యాయ జ‌రిగేలా ప్ర‌భుత్వం త‌మ వంతుగా కృషి చేస్తుంద‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. 

నవంబర్ 24 ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్తాన్  ఎల్లాపూర్ కు చెందిన సమత భర్తతో కలిసి జీవిస్తోంది. జైనూర్ లో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్న ఆ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. దంపతులు ఇద్దరూ తల వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రోజువారీలాగే ఈనెల 24న లింగాపూర్‌ మండల పరిసర ప్రాంతాల్లో బుగ్గలు అమ్ముకునేందుకు వెళ్లారు సమత దంపతులు.  

ఆదివారం ఉదయమే భార్యభర్తలు ఇద్దరూ బుగ్గలు అమ్మేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. భార్య సమతను ఏల్లాపటార్ లో దించి ఆమె భర్త గోపి ఖానాపూర్ వైపు వెళ్లాడు. లింగాపూర్ జంక్షన్ వద్ద ఉండాలని చెప్పి గోపి ఖానాపూర్ వెళ్లాడు. 

తిరిగి వచ్చేసరికి సమత కనిపించకపోవడంతో ఆందోళనపడ్డాడు. సాయంత్రం వరకు వేచి చూసినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో లింగాపూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఎస్సై వెంకటేశ్‌ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

మరుసటి రోజు ఉదయం 10 గంటలకు రామునాయక్‌తాండ శివారు చెట్లపొదల్లో లక్ష్మి (30) శవమై కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉండడం,అనుమానస్పదస్థితిలో మృతిచెందడంతో డీఎస్పీ సత్యనారాయణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

లక్ష్మిపై లైంగికదాడి చేసి అనంతరం ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా ఏల్లపటార్ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను సూతం అదుపులోకి తీసుకున్నారు.  

బుగ్గలు అమ్ముకునేందుకు వెళ్లిన సమతపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆమె బంధువులు మృతదేహంతో మండల కేంద్రానికి చేరుకుని గాంధీచౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. 

లైంగికదాడి చేసి హత్యకు పాల్పడిన మానవ మృగాలను అత్యంత దారుణంగా శిక్షించాలని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనుమానితులుగా భావిస్తున్న వారి ద్విచక్రవాహనాలను సైతం దహనం చేశారు. దాంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. 
 

click me!