
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అయితే తాజాగా నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఇక, తెలంగాణ నూతన సచివాలయం విషయానికి వస్తే.. 20 ఎకరాల స్థలంలో రూ. 617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో అధునాతనంగా నిర్మాణం చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్ ఉంటాయి. నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని అదే రోజు నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురిని ఆహ్వానించారు. ఇక, నూతన సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేసేలా మంత్రి కేటీఆర్.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల ప్రజాప్రతినిధులతో గురువారం సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు.
అయితే తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాకి షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.