టీడీపీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం .. చంద్రబాబుకు థ్యాంక్స్ : పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 2, 2024, 3:05 PM IST
Highlights

టీడీపీ వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . దీనికి గాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజల కోసం కాంగ్రెస్‌కు టీడీపీ మద్ధతు పలికిందని పొంగులేటి అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పరోక్ష సహకారం అందించిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన రేవంత్ రెడ్డికి తెలుగు తమ్ముళ్లు సంపూర్ణ సహకారం అందించారన్నది బహిరంగ రహస్యం. కేవలం రేవంత్ కోసమే ఆ పార్టీ తెలంగాణలో పోటీలో నుంచి తప్పుకుందని అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్ జెండాలతో పాటు పసుపు జెండాలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. దీనికి గాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. 

తెలంగాణలో మార్పు కోరుకున్న ప్రజల కోసం కాంగ్రెస్‌కు టీడీపీ మద్ధతు పలికిందని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం నిద్రాహారాలు మాని పనిచేశారని.. తమకు సహకరించినవారిని ఎప్పుడూ మర్చిపోనని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. తమ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు పూర్తి మద్ధతు పలికారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అందరం కలిసి పనిచేద్దామని పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!