తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత

By narsimha lodeFirst Published Jul 27, 2023, 1:21 PM IST
Highlights

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే ఫలితంపై  ఇచ్చిన తీర్పుపై  స్టే  కోరుతూ  ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

హైదరాబాద్: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ ను హైకోర్టు గురువారంనాడు  కొట్టివేసింది.ఈ నెల  25వ తేదీన కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక ఫలితంపై  తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.  వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదని హైకోర్టు ప్రకటించింది.  2018 నుండి జలగం వెంకటరావును  ఎమ్మెల్యేగా గుర్తిస్తూ  హైకోర్టు తీర్పును వెల్లడించింది.

ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ  ఈ నెల  26న వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేశారు. తాను సుప్రీంకోర్టులో  ఈ తీర్పుపై సవాల్  చేసేవరకు  స్టే ఇవ్వాలని  వనమా వెంకటేశ్వరరావు  ఆ పిటిషన్ లో కోరారు.  నిన్ననే  ఈ పిటిషన్ పై  వాదనలను హైకోర్టు విన్నది. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది. వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి  వనమా వెంకటేశ్వరరావు  విజయం సాధించారు. వనమా వెంకటేశ్వరరావు  ఎన్నికల సంఘానికి సమర్పించిన  అఫిడవిట్ లో ఆస్తులు, కేసుల అంశాలను  ప్రస్తావించలేదని  జలగం వెంకటరావు  తెలంగాణ హైకోర్టులో  2019లో  పిటిషన్ దాఖలు  చేశారు.  ఎన్నికల అఫిడవిట్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయాలని  హైకోర్టును కోరారు.జలగం వెంకటరావు  పిటిషన్ పై విచారణ నిర్వహించిన  తెలంగాణ హైకోర్టు  ఈ నెల  25న సంచలన తీర్పును వెల్లడించింది.  

వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసింది.2018 నుండి జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది.  ఈ తీర్పు కాపీని జలగం వెంకటరావు ఈ నెల  26న  తెలంగాణ అసెంబ్లీ  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు అందించారు.  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్ రాజ్ కు  కూడ  తీర్పు కాపీని అందించారు.

also read:వనమాపై అనర్హత వేటు:తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్‌కు హైకోర్టు తీర్పు కాపీ అందించిన జలగం

2018  ఎన్నికల సమయంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా  వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు.  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అభ్యర్ధిగా జలగం వెంకటరావు  పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావుపై  వనమా వెంకటేశ్వరరావు 4వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  ఆ తర్వాత చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.   వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరిన తర్వాత జలగం వెంకటరావు  పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాను  కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నానని నిన్న మీడియా సమావేశంలో జలగం వెంకటరావు  ప్రకటించారు


 

click me!