
ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం పూట పిల్లలకు అల్పాహారాన్ని అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం స్కూలుకు వచ్చిన విద్యార్ధులకు టిఫిన్ పెడతామని ఆదేశాలు జారీ చేసింది. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య బెల్లం, రాగితో చేసిన పదార్ధాలను అందిస్తామని తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విద్యార్ధులు ఖాళీ కడుపుతో స్కూలుకు వస్తున్నారని.. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే మధ్యాహ్నం భోజనం మెనూలోనూ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒకరోజు వెజిటబుల్ బిర్యానీతో పాటు హైస్కూల్ విద్యార్ధులకు తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందిస్తామని పేర్కొంది.