తన తల్లి కృష్ణకుమారి మరణంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కన్నీటిపర్యంతం అవుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం రాజ్ భవన్ లో ఆమె పార్థివదేహాన్ని సందర్శన కోసం వుంచారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు కృష్ణకుమారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గవర్నర్ తో పాటు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ను పట్టుకుని గవర్నర్ తమిళిసై బోరున విలపించారు. దీంతో గవర్నర్ ని ఓదార్చారు జస్టిస్ హిమ కోహ్లీ. కృష్ణకుమారి భౌతిక కాయాన్ని తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించి అక్కడే అంత్యక్రియలు జరపనున్నారు.
వీడియో
తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ కుమారినందన్ భార్యే కృష్ణకుమారి. ఈ దంపతుల పెద్దకూతురే తెలంగాణ గవర్నర్ తమిళిసై. కూతురి వద్ద వుంటున్న కృష్ణకుమారి మంగళవారంనాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను వెంటిలేటర్ మీద ఉంచారు. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.
గవర్నర్ తల్లి కృష్ణకుమారి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. తమిళిసై కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ తమిళిసై తల్లి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తమిళిసై కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు