ఓటు వేస్తూ...పోలింగ్ బూత్‌‌లోనే కుప్పకూలాడు

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 11:13 AM IST
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన వ్యక్తి పోలింగ్ బూత్‌లోనే కుప్పకూలిపోయాడు. వరంగల్ నగరానికి చెందిన పరమాండ్ల స్వామి అనే వ్యక్తి ఓటేసేందుకు పైడిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వచ్చాడు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించేందుకు వచ్చిన వ్యక్తి పోలింగ్ బూత్‌లోనే కుప్పకూలిపోయాడు. వరంగల్ నగరానికి చెందిన పరమాండ్ల స్వామి అనే వ్యక్తి ఓటేసేందుకు పైడిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు వచ్చాడు.

క్యూలైన్‌లో వేచి ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. వెంటనే అప్రత్తమైన తోటి ఓటర్లు, పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలోని 119 శాసనసభ స్థానాల్లో... 1821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇందుకోసం 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 55,329 ఈవీఎంలు, 42,751 వీవీప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఓటర్, పోలింగ్ బూత్‌ల సమాచారం కోసం నా ఓటు యాప్‌‌ను వినియోగించుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 279 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 5 రాష్ట్రాల నుంచి 18,860 మంది బలగాలను మోహరించారు.

దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, బ్రెయిలీ లిపీలో ఎపిక్ కార్డ్స్, సైన్ బోర్డ్స, ర్యాంపులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

గత ఎన్నికలకు భిన్నంగా తొలిసారిగా ఓటు ఎవరికి వేశామో పోలింగ్ కేంద్రంలోనే తెలుసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్‌లను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, వెబ్‌ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

click me!