
తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని వ్యుహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్.. ఇప్పటికే ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్తో సహా మూడు స్వతంత్ర ఏజెన్సీల చేత క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించారు. మొత్తం మూడు సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులను సిద్దం చేశారు. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో.. సర్వేల ప్రకారం ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ఇచ్చేందుకు గులాబీ పార్టీ నాయకత్వం సిద్ధమైంది.
ఇప్పటికే మూడు సంస్థలు వాటి నివేదికలను.. కేసీఆర్కు సమర్పించినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్న అధినాయకత్వం.. ఎమ్మెల్యేలకు ర్యాంకులను సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు విషయానికి వస్తే.. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఎంతవరకు అందుబాటులో ఉంటారు..?, ఎమ్మెల్యే హయాంలో నియోజవర్గంలో జరిగిన అభివృద్ది, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు.. వాటిపై ఎమ్మెల్యే స్పందించారు, నియోజవర్గంలోని ప్రజల్లో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలా..? వద్దా..? అనే విషయంలో ఈ ర్యాంకులు కీలకంగ మారనున్నాయి.
దీంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరికి ర్యాంకుల టెన్షన్ పట్టుకుంది. ర్యాంకుల్లో చివరన నిలిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం ఇచ్చే ర్యాంకుల్లో చివరన నిలిచిన వారిని.. వారి పనితీరును మెరుగుపరుచుకోవడానికి టీఆర్ఎస్ అధిష్టానం మరో 6 నెలల సమయం ఇచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఇక, 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్ మూడు నెలల ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆరు నెలల ముందుగానే టికెట్లను ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తుంది.
ఇక, సర్వేల్లో సమాజంలోని అన్ని ప్రధాన వర్గా పల్స్ తెలుసుకోబడ్డాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాలేజ్లు, యూనివర్సిటీలలో కూడా కవర్ చేయబడ్డాయని.. విద్యార్థుల, ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించారని చెప్పాయి. ఓటర్లలో పెద్ద సంఖ్యలో ఉన్న రైతులు, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పట్టీ నుంచి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించినట్టుగా పేర్కొన్నాయి.