K ChandraShekar Rao : రైతుబంధు పుట్టించిందే నేను.. రూ.16 వేలు కావాలా , వద్దా : కేసీఆర్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 16, 2023, 05:24 PM IST
K ChandraShekar Rao : రైతుబంధు పుట్టించిందే నేను.. రూ.16 వేలు కావాలా , వద్దా : కేసీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

రైతుబంధును పుట్టించిందే తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతుబంధు దుబారానో కాదో రైతులే తేల్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెరగాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు.   

రైతుబంధును పుట్టించిందే తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిజామాబాద్ రూరల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రూ.5 లక్షలతో రైతుబీమా అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని, రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. 3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడని రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రైతులంతా 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారంటూ కేసీఆర్ చురకలంటించారు. 10 హెచ్‌పీ మోటార్లు ఎవరు కొనివ్వాలని ఆయన ప్రశ్నించారు. ధరణితో రైతుల భూములు సేఫ్‌గా వున్నాయని.. మీ భూమిని మార్చే అధికారం సీఎంకు కూడా లేదని కేసీఆర్ తెలిపారు. నాడు ప్రజలు వద్దని వారించినా తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏపీలో కలిపిందని ఆయన దుయ్యబట్టారు. 

1969లో తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పొట్టనబెట్టుకుందని కేసీఆర్ గుర్తుచేశారు. రూ.200 వున్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామని సీఎం తెలిపారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా రైతుబంధు లాంటి పథకం లేదన్నారు. రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయని కేసీఆర్ తెలిపారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని సీఎం పేర్కొన్నారు. రైతుబంధు దుబారానో కాదో రైతులే తేల్చాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెరగాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు. 

3 గంటల కరెంట్ వ్యవసాయానికి ఎలా సరిపోతుందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటార్లు ఎక్కడైనా వాడతారా అని సీఎం ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి వుంది కాబట్టే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో పడుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎలా వస్తుందని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వమే వైద్య బృందాలను పంపించి కంటి పరీక్షలు చేయించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కంటి వెలుగు లాంటి పథకాలను గత ప్రభుత్వాలు ఆలోచించాయా అని సీఎం ప్రశ్నించారు. ఓటేసే సమయంలో ఏమరపాటుగా వుంటే మళ్లీ పాత కష్టాలే వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.     

PREV
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే