వరదలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష.. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం

By Siva KodatiFirst Published Jul 22, 2021, 5:39 PM IST
Highlights

వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి.. నిరాశ్రయులకు షెల్టర్లు, భోజన వసతులు ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే ప్రమాదం వుందని సీఎం హెచ్చరించారు. 

రాష్ట్రంలోని వరదలు, భారీ వర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వరదల పరిస్ధితిపై ఈ సందర్భంగా అధికారులు సీఎంకి వివరించారు. గోదావరికి వరద పెరుగుతోందని అధికారులు కేసీఆర్‌కి తెలిపారు. దీంతో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్ ప్రకటించారు. కొత్తగూడెం, ఏటూరు నాగారానికి ఆర్మీ అధికారులు హెలికాఫ్టర్‌లో వెళ్లినట్లు తెలిపారు. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్లు ముఖ్యమంత్రికి వివరించారు.

Also Read:భద్రాద్రి వద్ద గోదావరి మహోగ్రరూపం... నీట మునిగిన పర్ణశాల, రెడ్ అలర్ట్ జారీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. వరదల్లో అనుభవం వున్న సిబ్బందిని రప్పించాలని కేసీఆర్ ఆదేశించారు. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సీఎం సూచించారు. ప్రజలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే వుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ రాష్ట్రాల్లో అన్ని ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తుతున్నారని కేసీఆర్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి.. నిరాశ్రయులకు షెల్టర్లు, భోజన వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగే ప్రమాదం వుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 
 

click me!