ఫిబ్రవరి తొలివారంలో రాష్ట్ర బడ్జెట్‌.. కసరత్తు ముమ్మరం చేసిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్ కావడంతో సర్వత్రా ఆసక్తి..

Published : Jan 21, 2023, 03:24 PM ISTUpdated : Feb 02, 2023, 03:58 PM IST
ఫిబ్రవరి తొలివారంలో రాష్ట్ర బడ్జెట్‌.. కసరత్తు ముమ్మరం చేసిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్ కావడంతో సర్వత్రా ఆసక్తి..

సారాంశం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌‌కు సంబంధించి కసరత్తు ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌‌కు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. శాఖలవారీగా సమీక్షలు కొనసాగిస్తున్నారు. ఇక, అన్ని శాఖలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపాలని 10 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటికే పలు శాఖలు ఆర్థిక శాఖకు తమ ప్రతిపాదనలు పంపాయి.  అయితే శనివారం సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలపై కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సమావేశాల ప్రారంభం రోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఇదిలా ఉంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమర్పించనుంంది. అందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, పన్నుల కేటాయింపులు (కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా) సహా కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే సాధారణంగా తెలంగాణ సర్కార్‌ మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. అయితే ఈ ఏడాది ఒక నెల ముందుగానే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఎక్కువగానే ఉండనున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్‌, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న తెలంగాణ సర్కార్.. ఈ ఏడాది మరో రూ. 20 వేల కోట్లు అధికంగా వెచ్చించే అవకాశం ఉంది. దళిత బంధు తరహాలో రాష్ట్రంలో గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే 2023-24 బడ్జెట్‌లో గిరిజన బంధుకు కూడా భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో చేసిన రుణమాఫీ హామీకి సంబంధించిన నిధులను కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి కూడా కేటాయింపులు భారీగానే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో సంక్షేమ పథకాలతో బ్యాలెన్స్ చేసుకుంటూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించనున్నట్టుగా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu