
Vijaya Shanthi Fires On Kcr And Ktr : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సర్కారుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు విజయశాంతి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కేసీఆర్, కేటీఆర్ పై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయ శాంతి.. తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు వద్ద కూడా అప్పు దొరకని పరిస్థితి నెలకొందని.. అయినా కేసీఆర్ గొప్పలు మానట్లేదని ఆక్షేపించారు. "ధనిక రాష్ట్రం.. ఒక్కో ఎకరం కోట్లు.. అందులో నంబర్ వన్.. ఇందులో ఆదర్శం.. ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి కానీ, ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు రాష్ట్రాన్ని కాస్తా.. ఇప్పుడు అప్పుల కుప్పగా కేసీఆర్ మార్చేశారు. అప్పు పుడితేనే సర్కార్ బండి ముందుకు కదిలే పరిస్థితి " అని విజయశాంతి ట్వీట్ చేశారు.
అలాగే, "అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక... గప్పాలు పోవడం తప్ప కేసీఆర్ సర్కార్కే చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు" అంటూ విమర్శించారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తెలంగాణకు రూపాయి అప్పు పుట్టే ఆవకాశం లేదన్నారు. మూడు రాష్ట్రాలకు మాత్రమే రూ.8,500 కోట్ల మేర రుణాలు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు మొగ్గు చూపగా.. అందులో తెలంగాణ పేరు లేదని పేర్కొన్నారు. "ఈ నెల 2న రూ.3 వేల కోట్లు అప్పు తీసుకోలేకపోయిన తెలంగాణ.. కనీసం మే 17న రూ.2 వేల కోట్లు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ,రిజర్వుబ్యాంకు చేతులెత్తేయడంతో తెలంగాణలో జూన్ రెండో వారానికల్లా ఇవ్వాల్సిన రైతుబంధు ఆలస్యం అవుతుంది.రైతుబంధు కోసం రూ.7,600 కోట్లు అవసరమవుతుంది" అని తెలిపారు.
ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే.. ఇప్పటికే రైతు బంధు చెల్లింపు ఆలస్యమవుతోంది. 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నుంచి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈసారి కూడా మే నెలలో ఇవ్వడం కష్టమేనని విజయశాంతి పేర్కొన్నారు. శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్సలాగే కేసీఆర్ కూడా పదవి నుంచి దిగిపోతేనే తెలంగాణ బాగుపడుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా చిన్న దొర పాల్గొన్న ప్రతీ ప్రోగ్రాంలోనూ తెలంగాణ సూపర్, బంపర్ అంటూ డబ్బా కొట్టుకోవడం మాత్రం కామన్ అయింంటూ విమర్శించారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలక... గప్పాలు పోవడం తప్ప కేసీఆర్ సర్కార్కే చెల్లింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారన్నారు.