
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) 14 తేదీన జోగులంబ గద్వాల జిల్లా (jogulamba gadwal district) అలంపూర్ నుండి ప్రారంభిస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సుమారు 311 కిలోమీటర్ల మేర సాగే ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరంతో ముగిస్తామన్నారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజన్న ఆశీర్వచనం కోసం వచ్చానని ఆయన స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఎల్లుండి ఢిల్లీకి వెళ్తున్నారని.. మళ్లీ ఎందుకు వెళ్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. సిల్లీ రాజకీయాల కోసం, ధాన్యం కొనుగోలు లేకుంటే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడేళ్ల నుండి లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నావని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతున్నారని.. పంటలు కోతకి వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసం కొంత మంది బ్రోకర్లకు కేసీఆర్ వత్తాసు పలుకుతున్నాడని బండి సంజయ్ ఆరోపించారు. కమీషన్ల మీద కక్కుర్తి తప్ప వేరే ధ్యాస లేదని, సీఎంను రైతులెవరూ నమ్మడం లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్కి నమ్మకం లేదని.. అందుకే మహిళలను అగౌరవ పరిచాడని మండిపడ్డారు. కేటీఆర్ డ్రామా రావు అని.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు రైతన్నలకు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) శనివారం బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ (trs) వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర వుందని ఆయన ఆరోపించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని.. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా (paddy procurement) ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ (kcr) రచించిన ఈ కుట్రలో అన్నదాతలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరిగి తెరిచేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి అంటూ బండి సంజయ్ రైతులకు పిలుపునిచ్చారు.
బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీని వెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని బండి ఆరోపించారు. రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలని సూచించారు. మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయ నిర్ణేతలు మీరేనని….ఒక్కసారి ఆలోచించాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.