టీఆర్ఎస్ 100 తప్పులు పూర్తయ్యాయి.. ఇక శిక్ష తప్పదు : ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 09, 2022, 05:51 PM ISTUpdated : Apr 09, 2022, 06:02 PM IST
టీఆర్ఎస్ 100 తప్పులు పూర్తయ్యాయి.. ఇక శిక్ష తప్పదు : ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

టీఆర్ఎస్ సర్కార్ 100 తప్పులు పూర్తయ్యాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ ప్రభుత్వం చేసిన 100 తప్పులకు పరిహారంగా ప్రజలు తనను గెలిపించారని ఈటల ఉద్ఘాటించారు  

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శిశుపాలుడితో పోల్చారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) . శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో (mahabubnagar district) కిసాన్ మోర్చా (kisan morcha) ఏర్పాటు చేసిన రైతు సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు ఇప్పటిదాకా శిశుపాలుడి తరహాలో 100 తప్పులు చేసిందని, 101వ తప్పుకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ చేసిన 100 తప్పులకు పరిహారంగా ప్రజలు తనను గెలిపించారని ఈటల ఉద్ఘాటించారు. కేసీఆర్ తాను తప్పులు చేస్తూ, రైతులకు అన్యాయం చేస్తున్నారని రాజేందర్ విమర్శించారు. ఇది కంప్యూటర్ యుగం అయినా, అన్నం పెట్టేది భూమాతేనని స్పష్టం చేశారు. అలాంటి వ్యవస్థను కాపాడకుండా, వరి వేస్తే ఉరి అంటున్నారని ఈటల మండిపడ్డారు. 

అంతకుముందు రైతన్నలకు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) శనివారం బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ (trs) వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర వుందని ఆయన ఆరోపించారు. భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ వేసిందని.. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా (paddy procurement) ప్లాన్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రైతుల్లో వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారని ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ (kcr) ర‌చించిన ఈ కుట్ర‌లో అన్న‌దాత‌ల‌కు భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను తిరిగి తెరిచేలా కేసీఆర్ మెడ‌లు వంచుదాం రండి అంటూ బండి సంజయ్ రైతుల‌కు పిలుపునిచ్చారు. 

బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీని వెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని బండి ఆరోపించారు. రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలని సూచించారు. మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. న్యాయ నిర్ణేతలు మీరేనని….ఒక్కసారి ఆలోచించాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్