
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao సోమవారం నాడు Telangana Budget 2022 ను ప్రవేశ పెట్టారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మూడే మెడికల్ కాలేజీలుండేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి విడతలో మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.
వీటిల్లో పీజీ కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా మంత్రి తెలిపారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ మెడికల్ కాలేజీలను ప్రారంభించేలా చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.
అదే విధంగా భవనాల నిర్మాణం, వైద్య సిబ్బంది, నియామక ప్రక్రియ జరుగుతుందని మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది కొత్తగా ఎనిమిది Medical కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.
ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రి భువనగరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ లో రూ. 1000 కోట్లు ప్రతిపాదిస్తున్నామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 టన్నుల నుండి 550 టన్నులకు పెంచామని మంత్రి తెలిపారు.
corona వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా పనిచేసిందన్నారు. ఈ విషయాన్ని ఆర్ధిక సర్వే గుర్తించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
హెచ్ఎండీఏ పరిధిలో బస్తీ దవాఖానాలను పెంచాలని కూడా నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ చెప్పారు.హైద్రాబాద్ లో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు.
వీటిలో 57 రకాల పరీక్షలను నిర్వహిస్తారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో మరో 84 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకొన్నామన్నారు. వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని రాజ్యసభలో కేంద్రం ప్రశంసించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించామన్నారు.