
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంపు ప్రతిపాదన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ గురువారం నాడు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కకుండా పోతాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
త్వరలోనే రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెన్షన్ పెంపు బిల్లుకు కూడ అసెంబ్లీ ఆమోదించింది. కనీస పెన్షన్ ను రూ. 50 వేల నుండి రూ. 70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చు పరిమితిని లక్ష రూపాయాల నుండి రూ. 10 లక్షలకు పెంచుతూ సభ ఆమోదం తెలిపింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పీఆర్సీని కూడ ఉద్యోగులు కోరుకొన్నట్టుగానే ఇస్తామని ప్రకటించారు. పీఆర్సీపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇవాళ రిటైర్మెంట్ వయస్సు పెంపు బిల్లు ఆమోదం తెలిపింది.