ఈ ఏడాది ఆ మూడు పంటలే పండించండి..: రైతులకు వ్యవసాయ మంత్రి సూచన

By Arun Kumar PFirst Published Mar 30, 2021, 12:49 PM IST
Highlights

పంటల కొనుగోళ్లపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు, 

హైదరాబాద్: తెలంగాణలో పండిస్తున్న పంటలసాగులో మార్పులు రావాలని... రైతులు వాటిని ఆహ్వానించి ఆచరించాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.  కంది, పత్తి, వేరుశనగ పంటలు అధికంగా సాగుచేయాలని అన్నదాతలకు మంత్రి సూచించారు. 

పంటల కొనుగోళ్లపై చర్చించేందుకు మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి,  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు, 

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... భవిష్యత్ లో కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుందన్నారు. ప్రభుత్వ సాగు అనుకూల విధానాలతో తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. దీంతో పంటల దిగుబడి పెరిగిందని... ఇది సంతోషంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తుందన్నారు. 

''గతంలో పత్తి 54లక్షల ఎకరాలలో సాగయితే, ఈ సారి 61లక్షల ఎకరాలలో సాగు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపారు. ఇప్పటికీ పత్తి సాగును మరింత పెంచాలని వ్యవసాయ శాఖ తరపున రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ పత్తి నాణ్యతలో దేశంలో మొదటి స్థానం, దిగుబడిలో దేశంలో రెండో స్థానంలో నిలిచింది'' అన్నారు. 

read more   గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కేసీఆర్

''ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కంది సాగును రైతులు పెంచారు. ప్రభుత్వ మద్దతుధర కన్నా అధికధర బహిరంగ మార్కెట్ లో లభించింది. వేరుశనగ పంటకు కూడా మద్దతుధర కన్నా అధికధర మార్కెట్ లో లభించింది'' అని పేర్కొన్నారు. 

''వానాకాలంలో సన్నరకాల వరి సాగును పెంచండి .. దొడ్డు రకం వడ్ల సాగు తగ్గించండి.  దొడ్డు రకం వడ్ల వినియోగం కన్నా ఉత్పత్తి అధికంగా ఉంది. దొడ్డురకాలు మరింత సాగు పెరిగితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది'' అని హెచ్చరించారు. 

''కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి ఆంక్షలు లేనివిధంగా పంటలను సాగు చేయించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్ లో కేంద్రం కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ముందే అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం  మీద ఉంది. రైతుల ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వాల లక్ష్యం కావాలి'' అన్నారు. 

''పంటల సాగు విషయంలో ఎర్నెస్ట్-యంగ్ సంస్థ శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. దాని ప్రకారం రైతులకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించి చైతన్యం చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతుల ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగా గోదాంలు వున్నాయి. మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యంగల గోదాంలను నిర్మిస్తుంది.రాష్ట్రంలో గోదాంల నిర్మాణానికి సెంట్రల్ వేర్ హౌసింగ్ ఆసక్తి చూసుతోంది'' అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 
 

click me!