ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అరెస్ట్

By Siva KodatiFirst Published Mar 21, 2023, 9:22 PM IST
Highlights

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో వున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండ్రోజులుగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో వున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన వార్తా సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఆదివారం కొందరు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీనిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

ఇకపోతే.. రెండేళ్ల క్రితం జరిగిన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న హోరాహోరీగా పోరాడి ఏకంగా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించాడు. మల్లన్న ఓటమి చెందినప్పటికీ...  ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఎలా ఓట్లు సాధించాడన్న చర్చ నడిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ వి6 లో ఉద్యోగానికి  రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. 
 

click me!