
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలో ముసలం ఏర్పడింది. సీట్ల సర్ధుబాటుపై హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ హోటల్ లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సర్వే సత్యనారాయణ,డీకే అరుణతోపాటు సీనియర్ నేతలు, ఏఐసీసీ కార్యదర్శలు హాజరయ్యారు.
సీట్ల సర్ధుబాటు అంశంపై నేతలతో కుంతియా సమావేశం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ 100స్థానాల్లో కచ్చితంగా పోటీ చెయ్యాలని నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. 19 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాలని ఎన్నికల కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా సీట్ల సర్ధుబాటుపై నేతల్లో ఏకాభిప్రాయానికి రావడం లేదు. దాదాపు 50 సీట్ల విషయంలో నేతల మధ్య ఐక్యత కనిపించినప్పటికీ మిగిలిన సీట్ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదు.
దీంతో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బయటకు వచ్చేశారు. ఎన్నికల కమిటీలో నేతలు వ్యవహరించిన తీరుతో కుంతియా తలపట్టుకున్నారు. విడివిడిగా నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
మరోవైపు ఈఎన్నిల్లో ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికే అత్యధిక సీట్లు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో మాలలకు ఎక్కువ సీట్లు కేటాయించారని ఈసారి మాత్రం మాదిగలకే ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.