తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు: ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

By narsimha lodeFirst Published Sep 19, 2022, 5:07 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై  దాఖలైన పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ:తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై విచారణకు సుప్రీంకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై సుప్రీంకోర్టులో గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైంది. 

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలను 153కి, ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలను 225 పెంచాలని ఈ పిటిషనర్ కోరారు.  రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచుకోవచ్చని ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం తెలిపిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకు వచ్చారు. అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచుతామని కేంద్రం తేల్చి చెప్పింది

ఇటీవల కాలంలో పార్లమెంట్ లో ఈ విషయమై వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దీంతో పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు .  ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది .

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కేంద్ర ప్రభుత్వాలతో పాటు  ఎన్నికల సంఘాన్ని  ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్న ప్రతినాదులకు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు పంపింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ కు ఈ పిటిషన్ ను కూడా జతచేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 

2026 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయమై 2021 ఆగస్టు 4న  కేంద్ర హోంశాఖ సహయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు.  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహయమంత్రి సమాధానం ఇచ్చారు. 
 

click me!