
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ ఎంజీఎం (warangal mgm) ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (telangana govt) సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్పై బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్గా వున్న చంద్రశేఖర్కు బాధ్యతలు అప్పగించింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వైద్యులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao విచారణకు ఆదేశిస్తున్నట్టుగా గురువారం నాడు ప్రకటించారు. ఈ ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావొద్దని హరీష్ రావు వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.
కాగా.. Warangal ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నీలు పాడైన స్థితిలో చికిత్స కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి చేరాడు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం స్పృహలో లేడు. అయితే ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ కాళ్లు, చేయిని ఎలుకలు కొరికాయి. దీంతో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి రోగి బంధువులతో చర్చించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో విధుల్లో అందరూ ఉన్నారా , ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే విషయమై కూడా ఆరా తీశారు. ఐసీయూలోకి ఎలుకలు ఎలా వచ్చాయనే విషయమై కూడా అడిషనల్ కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండ్ ను ప్రశ్నించారు.
శానిటేషన్ సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒకరోజు పసికందును కుక్కలు కరిచి చంపాయి. ఈ ఘటన 2011 జనవరి 12న చోటు చేసుకొంది. ఈ ఘటన తర్వాత 2018లో మృత శిశువును ఎలుకలు కొరికిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.