తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడ చాలా ఆసక్తిగా ఉంది. ఈ మేరకు పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లక్ష్మణ్ మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. మరికొందరు నేతలు కొత్త నేతకు పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని నమ్మే వాళ్లు కూడ లేకపోలేదు.
డాక్టర్ లక్ష్మణ్ మూడేళ్లుగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం ముగిసి ఆరు వారాలు పూర్తి అవుతోంది. వాస్తవానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ ఏడాది జనవరి మాసంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, సీఏఏ నిరసనలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ఈ ఎన్నికలను వాయిదా వేశారు.
మరో వైపు ఈ ఎన్నికలు మరికొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడ చాలా ఆసక్తిగా ఉంది. ఈ మేరకు పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దాదాపు 30 ఏళ్ల నుండి బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వారంతా హైద్రాబాద్కు చెందినవారే. హైద్రాబాద్కు వెలుపల ఉన్న వారేవరూ కూడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసినవారు లేరని కొందరు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడ పార్టీ నాయకత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జిల్లాల నుండి వచ్చిన నేతలకు రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెడితే జిల్లాల్లోని పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే అవకాశం ఉందని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ మంత్రి డికె అరుణ, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిల పేర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
Also read:కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ: బీజేపీలోకి కొత్తకోట దంపతులు?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లు కూడ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే డాక్టర్ లక్ష్మణ్ పదవి కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉందనే సెంటిమెంట్ కూడ లేకపోలేదు.