తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్పేట్ కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా వున్న స్మిత భర్త సిద్ధార్ధ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మనోజ్కు స్మితతో ఎలా పరిచయం ఏర్పడిందో తనకు తెలియదన్నారు. మనోజ్ను తాను ఎప్పుడూ చూడలేదని.. 2018 నుంచి స్మిత తనకు దూరంగా వుంటోందని సిద్ధార్ధ్ చెప్పాడు.
2019లో విడాకుల కోసం స్మిత కోర్టుకు వెళ్లిందని తెలిపాడు. తన పిల్లలు సీడబ్ల్యూసీని ఆశ్రయిస్తే.. అధికారులు తనకు ఫోన్ చేసి పిలిచారని అందుకే శామీర్పేట్ వెళ్లినట్లు సిద్ధార్ధ్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే మనోజ్ తనపై కాల్పులకు పాల్పడ్డాడని.. తుపాకీ ఎక్కుపెట్టగానే భయం వేసిందని, వెంటనే అక్కడి నుంచి పారిపోయానని పేర్కొన్నాడు. బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని సిద్ధార్ధ్ చెప్పాడు. సీడబ్ల్యూసీ అధికారులు తన స్టేట్మెంట్ తీసుకున్నారని సిద్ధార్ధ్ వెల్లడించారు.
మరోవైపు..శామీర్పేట్ కాల్పుల కేసుకు సంబంధించి బుల్లితెర నటుడు మనోజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం మనోజ్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఈకేసు దర్యాప్తు నిమిత్తం మనోజ్ను వారం రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ALso Read: శామీర్పేట్ కాల్పుల కేసు.. బుల్లితెర నటుడు మనోజ్కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లికి తరలింపు
కాగా.. కాల్పుల కేసుకు సంబంధించి మనోజ్ అలియాస్ సూర్యతేజను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శనివారం నాడు రాత్రి సెలబ్రిటీ విల్లాలో సిద్ధార్ధ దాస్పై మనోజ్ ఎయిర్గన్తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఆర్మ్స్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన సిద్ధార్ధ్ తన భార్య స్మిత 2019లో విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు.
భర్తతో విడిపోయిన స్మిత.. శామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్లో వుంటున్న బుల్లితెర నటుడు మనోజ్తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో సిద్ధార్ధ్ శనివారం తన పిల్లలను చూసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో మనోజ్, స్మితలతో ఆయన గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన మనోజ్ తన ఎయిర్గన్తో సిద్ధార్ధపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఈ కేసులో అనూహ్య ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్ , స్మితలు సినిమాల్లో అవకాశాల పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారు. దీనితో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి వీరిద్దరూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.