తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. బెంగాల్ తరహలోనే తెలంగాణలో కూడ బలోపేతం కావడానికి ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.ఈ నెల 27, 28 తేదీల్లో ఇతర పార్టీల నుండి ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ రంగం సిద్దం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. బెంగాల్ తరహలోనే తెలంగాణలో కూడ బలోపేతం కావడానికి ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.ఈ నెల 27, 28 తేదీల్లో ఇతర పార్టీల నుండి ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ రంగం సిద్దం చేసింది.
గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఇతర పార్టీల నుండి వలసలకు బీజేపీ నాయకత్వం పావులు కదిపినా ఫలితం కన్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానంతోనే సరిపెట్టుకొంది.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది.
తెలంగాణ నుండి విజయం సాధించిన కిషన్ రెడ్డికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేయాలనే దిశగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలను తమ పార్టీలో చేర్చుకొనే దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది.
ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలతో బీజేపీ అగ్రనేతలు టచ్లోకి వెళ్లారు. తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రంలో కూడ బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. టీడీపీకి చెందిన ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ చర్చలు జరుపుతోంది.
కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు టీడీపీలోని ముఖ్య నేతలతో బీజేపీ చర్చలు జరిపింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డిలు బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ కూడ బీజేపీ అగ్రనేతలతో చర్చించారు.
మరో వైపు హైద్రాబాద్లోని ఓ హోటల్లో బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ తెలంగాణఖు చెందిన కొందరు ప్రముఖులతో చర్చించారు. కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారు. జీహెచ్ఎంసీలోని కొందరు కార్పోరేటర్లు కూడ బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్టుగా బీజేపీ నేతలు చెబుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నియమితులైన జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 22 లేదా 27వ తేదీన నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ సమయంలోనే ఇతర పార్టీలకు చెందిన నేతలతో నడ్డా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల నుండి ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ముహుర్తంగా నిర్ణయించుకొన్నారని సమాచారం.
జీహెఛ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలపై బీజేపీ కన్నేసింది. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ , కంటోన్మెంట్ ఎన్నికలపై బీజేపీ కన్నేసింది. టీఆర్ఎస్ నుండి సుమారు 10 మంది కార్పోరేటర్లు బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీ తీవ్రంగా దెబ్బతింది. అయితే అక్కడక్కడ మిగిలి ఉన్న టీడీపీ నేతలపై బీజేపీ నాయకత్వం కన్నేసింది. బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉండాలని కొందరు టీడీపీ నేతలకు బీజేపీ నుండి సమాచారం అందిందని సమాచారం.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొందరు కీలక నేతలు కూడ కమలం తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.