తెలంగాణలో రోహింగ్యాలపై ఆందోళన:ఈ ప్రాంతాల నుంచి మిస్

By telugu teamFirst Published Apr 18, 2020, 1:55 PM IST
Highlights

తెలంగాణ నుంచి కొంత మంది రోహింగ్యాలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. మర్కజ్ కు వెళ్లిన వాళ్లు తిరిగి క్యాంపులకు చేరుకోలేదని గుర్తించారు. దీంతో వారి కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో రోహింగ్యాలకు సంబంధించిన ఆందోళన ప్రారంభమైంది. కొంత మంది రోహింగ్యాలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ నుంచి 14 మంది, బాలాపూర్ నుంచి 9 మంది, జగిత్యాల నుంచి ఆరుగురు రోహింగ్యాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ కు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో జరిగన దేవ్ బంద్ కు హాజరైన రోహింగ్యాలు కొంత మంది తిరిగి క్యాంపులకు చేరుకోలేదు. దీంతో తెలంగాణ అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది.

రోహింగ్యాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు వారి కోసం గాలిస్తున్నారు. అయితే, మర్కజ్ నుంచి వచ్చినవారందరినీ గుర్తించామని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. రోహింగ్యాలు కూడా మర్కజ్ కు వెళ్లినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

ఇదిలావుంటే, భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 14,378కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 448కి చేరుకుంది. 

ఒడిశాకు కొంత ఊరట లభించింది. గత మూడు రోజులుగా ఒడిశాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెంపులో తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి తగ్గిందని చెప్పింది.

రికవరీ రేటు శనివారం అత్యధికంగా నమోదైంది. మహారాష్ట్ర కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతూనే ఉన్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 286 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంంబైలోనే 177 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 194కు చేరుకుంది.

ఇండియన్ నేవీలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.తెలంగాణలో 766 కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 

click me!