
తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని (rahul gandhi) కలిసినట్లు చెప్పారు టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy). రాహుల్తో భేటీ అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాహుల్ మార్గదర్శకత్వంలో పనిచేస్తామని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై గట్టిగా పోరాడాలని రాహుల్ తెలిపారని జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ మూడు పార్టీలపై పోరాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయాలని చెప్పారని జగ్గారెడ్డి తెలిపారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో అనేక అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. పార్టీలో విభేదాల గురించి తాను ఏమీ మాట్లాడలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనకు ఎన్నో పార్టీల నుంచి ఆహ్వానం అందాయని.. కానీ, కాంగ్రెస్ను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మనమంతా ఒక కుటుంబమని రాహుల్ చెప్పారని జగ్గారెడ్డి వెల్లడించారు.
కాగా.. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు కీలక నేతల కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం లేదని జగ్గారెడ్డి మండిడ్డారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పలు బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో భగ్గుమన్న జగ్గారెడ్డి.. తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో జగ్గారెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది