ఆ ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్ లో ఆ రెండు గంటలు ఉచిత ప్రయాణం...

By Bukka SumabalaFirst Published Aug 17, 2022, 7:52 AM IST
Highlights

టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి తిరిగివెళ్లేవారికి రెండుగంటల పాటు బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు. దూరప్రాంతాలనుంచి వచ్చేవారికి కూడా ఇది వర్తిస్తుంది. 

హైదరాబాద్ : తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇకముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది ఆర్టీసీ. 

ఆసుపత్రికి వెళ్లి, వచ్చేప్పుడు..  
ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి వెళ్లి.. అక్కడ డాక్టర్లకు చూపించుకున్నాక.. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు రెండు గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఆస్పత్రిలో వైద్యులు రాసిన  మందుల చీటీపైనే టైం సూచిస్తారు. ఆ చిట్టిని కండక్టర్ కు చూపిస్తే  ఉచితంగా ప్రయాణించడానికి వీలు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా చేరుకోవచ్చు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి..
దూరప్రాంతాల నుంచి నగరానికి టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఆర్టీసీ. ఎంజీబీఎస్ తోపాటు నగరంలో ఎక్కడ దిగినా.. తర్వాత రెండు గంటలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రంగారెడ్డి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సామ్యూల్ తెలిపారు.

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ.. కార్గో సేవ‌ల ద్వారా రాఖీల‌ను పంపే ఛాన్స్..

ఇదిలా ఉండగా, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 12 రోజుల పాటు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన పుట్టిన చిన్నారులందరికీ వారికి 12  సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఈనెల 15న ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. టీ-24 బస్ టికెట్ ను ఆగస్ట్ 15న రూ. 75కే  విక్రయించేలా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఆగస్ట్ 8న ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.  మామూలు రోజుల్లో ఈ టికెట్ ధర 120 రూపాయలు ఉంటుంది. 

ఈ నెల పదో తేదీ నుంచి 21వ తేదీ వరకు12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అన్నారు. ‘మంగళవారం అంటే ఆగస్ట్ 9నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. ఆగస్ట్ 13 నుంచి15వ తేదీ వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాన్ని బస్సులు ఏర్పాటు  చేస్తాం.  ఉద్యోగులంతా అమృతోత్సవ్  బ్యాడ్జీలతోనే  విధులకు హాజరు కావాలి’  అని కోరారు..

ఆర్ టీసి ఇస్తున్న మరికొన్ని బంపర్ ఆఫర్లు…

- టిటిడి ప్యాకేజీని వినియోగించుకునే ప్రయాణికులకు ఈనెల 16 నుంచి 21 వరకు రూ.75 తగ్గింపు..

- ఆగస్ట్ 15న కార్గోలో ఒక కిలో పార్సిల్ 75 కిలోమీటర్ల వరకు ఉచిత రవాణా..

- టాప్ 75 ప్రయాణికులకు ఒక ట్రిప్ టికెట్ ఉచితం

- శంషాబాద్ విమానాశ్రయానికి ఆగస్టు 15న పుష్పక్ ఎయిర్పోర్టు సర్వీసును వినియోగించుకునే ప్రయాణికులు 75% ఛార్జి చెల్లిస్తే చాలు.

- 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో 15 నుంచి 22వ తేదీ వరకు ఉచిత వైద్య పరీక్షలు. 75 ఏళ్ల లోపు వారికి రూ. 750లతో  వైద్యపరీక్ష ప్యాకేజీ
 

click me!