వేములవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసి బస్సు రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 20మంది ప్రయాణికులు గాయాలపాయ్యారు.
సిద్దిపేట: 20మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసి బస్సు రోడ్డు ప్రమాదానికి గురయిన దుర్ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ సంభవించలేదు. డ్రైవర్ సహా ప్రయాణికులంతా గాయాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే... వేములవాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సోమవారం తెల్లవారుజామున 4గంటలకు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది. సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే బస్సు ప్రమాదానికి గురయ్యింది. రాజీవ్ రహదారిపై వేగంగా వెళుతూ ఓ కంటైనర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందుబాగం నుజ్జునుజ్జయ్యింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు... ప్రయాణికులంతా గాయాలపాలయ్యారు. దీంతో వారిని వెంటనే 108వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
రెండు భారీ వాహనాలు ఢీకొన్నా త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై నుండి వాహనాలకు పక్కకు తీయించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.