ఇలాగైతే నడవదు..: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ 

Published : Apr 28, 2025, 03:11 PM IST
ఇలాగైతే నడవదు..: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ 

సారాంశం

కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణను అప్పులపాలు చేసింది కేసీఆరే అని ఆరోపించారు. పథకాల అమలులో కమిట్మెంట్ తో ఉంటామన్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

Revanth Reddy : మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ వరంగల్ సభలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, పాలనపై తీవ్ర విమర్శలు చేసారు.  కాంగ్రెస్ పార్టీ ఆనాటినుండే తెలంగాణకు విలన్ లా ఉండేదంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. తాజాగా కేసిఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్  ఇచ్చారు. 

కేసిఆర్ బయట మీటింగ్ లు పెట్టి విమర్శలు చేయడంకాదు... అసెంబ్లీకి వచ్చి విమర్శలు చేస్తే తాము సమాధానం చెబుతామన్నారు. తెలంగాణను విధ్వంసం చేసిందే కేసీఆర్ అని అన్నారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది ఈ కేసీఆర్ కాదా? ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారకుడు కాదా? అని నిలదీసారు.  

తమ ప్రభుత్వం కేసీఆర్ మాదిరిగా పథకాలను ప్రారంభించి గాలికి వదిలేయనని...  కమిట్ మెంట్ తో అర్హులైన ప్రతిఒక్కరికి అందేలా చూస్తానని అన్నారు. రాజకీయాలైనా, పాలన అయినా కమిట్ మెంట్ తో చేస్తానన్నారు. ఇంకా 20 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటాను... ప్రజాసేవ చేస్తూనే ఉంటానని రేవంత్ అన్నారు. ప్రభుత్వం చాలా పనులు చేస్తోంది... కానీ చేసిన పనులన్నీ చెప్పుకోలేక పోతుందన్నారు.  ఇకపై కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు.  

ఎమ్మెల్యేల తీరుపై రేవంత్ అసహనం : 

కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసారు. ఎంతచెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడంలేదని... ప్రజల్లోకి వెళ్లడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో కాకుండా హైదరాబాద్ లో తిరిగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు... ఇలాగైతే నడవదని అన్నారు. ఇకపై అయినా నియోజకవర్గంలోనే ఎక్కువ సమయం గడపాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. సీఎల్పీ సమావేశాల్లోనూ అందరికీ ఇదే చెబుతున్నామని అన్నారు. 

ప్రజలకు ప్రభుత్వ పనితీరు గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంటే చేసి తీరుతుంది అనే పేరు ప్రజల్లో రావాలన్నారు. 

అధికారంలోకి వచ్చాక ఇంతకాలం ఎలా ముందుకు వెళ్లాలి అన్న ప్లానింగ్ కే సరిపోయింది.... ఇకపై దూకుడుగా ముందుకు వెళతామని సీఎం రేవంత్ అన్నారు. పథకాల అమలుపై ఫోకస్ పెడతామన్నారు. అర్హులకు ప్రతి పథకం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

అరెస్టులు చేస్తే ఏమవుతుందో తెలుసా? 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులకు అవినీతిని బైటపెట్టి జైల్లో పెడతామన్న మాటను రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.  ఇప్పటికే కేటీఆర్ పై కేసులుపెట్టగా విచారణ కొనసాగుతోంది... చట్టపరిధిలోనే ఇదంతా జరుగుతుందన్నారు. అరెస్టుల విషయంతో తొందరపాటు తగదని... అలా చేస్తే ఏం జరుగుతుందో ఆంధ్ర ప్రదేశ్ లో చూసామన్నారు. కాబట్టి గత బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ముందు ప్రజలముందు ఉంచుతామని... తర్వాతే అరెస్టులు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu